వీధి కుక్కల బీభత్సం
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:14 AM
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం జరిగిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
4 ఏళ్ల చిన్నారి కనుగుడ్డు బయటకు..
మరో బస్తీలో ఇద్దరు పిల్లలపై దాడి
భువనగిరి పట్టణంలో ఘటన
భువనగిరి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం జరిగిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తారకరామనగర్లో జరిగిన దాడిలో నాలుగేళ్ల బాలుడికి ఏకంగా కనుగుడ్డు ఊడి బయటకు వచ్చింది. ఆర్బీనగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికుల కథనం ప్రకారం.. తారకరామనగర్కు చెందిన డ్రైవర్ బండారు రాహుల్ పెద్ద కుమారుడు ప్రియాంశ్(4) ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు బాలుడిని ఒక్కసారిగా చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. బాలుడి ముఖాన్ని గాయపర్చడంతో కుడి కనుగుడ్డు బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు చిన్నారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడిచేసిన కుక్కను రాళ్లతో కొట్టి చంపారు. ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శస్త్రచికిత్స కొనసాగుతోందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. .