ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:18 PM
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ భవన సముదాయంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ భవన సముదాయంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే మున్సిపల్ కమీషనర్కు రాత పూర్వకంగా అందించినట్లయితే సవరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లో మొత్తం 149 వార్డులకు గాను 2,94,641 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 264, లక్షెట్టిపేటలో 30, బెల్లంపల్లిలో 68, చెన్నూరులో 36, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల విషయంలో ఏమైనా అభ్యంతరాలు తెలియజేయడాలని తెలిపారు. దరఖాస్తులను, అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ ఆలీ, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.