ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్ఎస్ బాధ్యతారాహిత్యం
ABN , Publish Date - May 24 , 2026 | 05:04 AM
ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
స్వార్థ రాజకీయాలతో ఆ పార్టీ ‘చీప్, డైవర్షన్ పాలిట్రిక్స్’
గ్రీన్ ఫార్మాకు కట్టుబడి ఉన్నాం
ఆ భూముల్లో లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విదేశాల నుంచే వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. అలాంటి ప్రకటనలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ స్వార్థంతో ‘చీప్, డైవర్షన్ పాలిట్రిక్స్’ చేస్తున్నారని విమర్శించారు. గతంలో మూసీ ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నంచేసిన వారే ఇప్పుడు ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా పేరిట కాలుష్యాన్ని వెదజల్లే విధానానికి తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని, ‘గ్రీన్ ఫార్మా’ అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఇదే విషయా న్ని హైకోర్టుకు కూడా తెలియజేశామని చెప్పారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా పేరిట కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలను తీసుకురావాలని ప్ర యత్నించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమల ఏర్పాటు దిశగా ముందుకెళుతోందని ఆయన చెప్పారు.