దక్షిణ మధ్య రైల్వేకు 21,211 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:18 AM
దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.21,211.92 కోట్ల ఆదాయం ఆర్జించిందని జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు....
జోన్ చరిత్రలో ఇదే రికార్డు
కాజీపేట డివిజన్ ప్రతిపాదన లేదు
జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.21,211.92 కోట్ల ఆదాయం ఆర్జించిందని జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఇది జోన్ చరిత్రలోనే రికార్డుస్థాయి ఆదాయమని, గత ఏడాదితో పోలిస్తే 3.12ు అధికమని చెప్పారు. కాజీపేట రైల్వే డివిజన్ ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని పేర్కొన్నారు. కొత్త డివిజన్ ఏర్పాటు చాలా క్లిష్టతరమైనదని, జోన్ పరిధిలో కొత్త డివిజన్ ఏర్పాటు అవశ్యకత కనిపించడం లేదని చెప్పారు. సరుకు రవాణాలో, ప్రయాణికులకు మెరుగైన సేవల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి అద్భుత విజయాలు సాధించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 28.65 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని, 14.79 కోట్ల టన్నుల సరుకు రవాణా చేశామని, ఇప్పటివరకు ఇదే అత్యధికమన్నారు. సరుకు రవాణాతో రూ.13,835 కోట్లు ఆర్జించిందని తెలిపారు. ప్రయాణికుల విభాగం నుంచి రూ.6,235.37 కోట్ల ఆదాయం సంపాదించిందని, ఇది గత ఏడాది వచ్చిన రూ.5,714.83 కోట్ల కంటే 9.11 శాతం ఎక్కువని వివరించారు.అమృత్భారత్ స్టేషన్ పథకం కింద 5 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. 72 రైల్ అండర్ బ్రిడ్జిలు, 27 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో 65 లెవల్ క్రాసింగ్ గేట్లు తొలగించామని తెలిపారు.