కేంద్రం సన్నబియ్యం డబ్బులిస్తే ప్రధాని ఫొటో అంశాన్ని పరిశీలిస్తాం!
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:55 AM
సన్నబియ్యం పంపిణీకి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తే, అప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టే అంశాన్ని ఆలోచిస్తామని..
ఇప్పటికే రేషన్ షాపుల్లో మోదీ ఫొటో
కేంద్రం ఇస్తోంది దొడ్డు బియ్యమే: ఉత్తమ్
సూర్యాపేట(కలెక్టరేట్), ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం పంపిణీకి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తే, అప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో పెట్టే అంశాన్ని ఆలోచిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదల కడుపు నింపే స్మార్ట్ రేషన్కార్డుల విషయంలో రాజకీయాలు, అనవసర రాద్ధాంతాలు చేయడం మానుకోవాలని సూచించారు. రేషన్ బియ్యం కోసం అరకొర నిధులిచ్చినవాళ్లు.. అసలు నిధులే ఇవ్వని వాళ్లు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్డుల్లో వాళ్ల ఫొటోలు పెట్టుకోవొద్దని తామేమీ చెప్పడం లేదన్నారు. రూ.14.9 కోట్లు వెచ్చించి తాము సన్నబియ్యం ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దొడ్డుబియ్యం మాత్రమేనన్నారు. కేంద్రాన్ని గౌరవించి ప్రొటోకాల్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి ఫొటో పెడుతున్నామని వివరించారు.