ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:37 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ నెలలో తుది చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ట్యాపింగ్ బాధితులను ఒకరి తర్వాత ...
తీగల కృష్ణారెడ్డి, దీపక్రెడ్డి వాంగ్మూలాల నమోదు
హైదరాబాద్, సరూర్నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ నెలలో తుది చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ట్యాపింగ్ బాధితులను ఒకరి తర్వాత మరొకరిని పిలిచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. మరోవైపు కేసు విచారణలో ఇప్పటి వరకు వచ్చిన అంశాల ఆధారంగా నిందితుల పాత్రను వివరిస్తూ అందుకు తగిన సాక్ష్యాధారాలను పొందుపరుస్తున్నారు. తాజాగా గురువారం తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు లంకల దీపక్రెడ్డిని సిట్ అధికారులు విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని, అన్ని పార్టీల వారితో తనకు మంచి సంబంధాలున్నాయని విచారణ అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు చెప్పలేదని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం పిలిపించినట్లు తనకు అర్థమైందని ఆయన తెలిపారు. కాగా, తన ఫోన్ను 2022 నుంచి ట్యాపింగ్ చేశారన్న విషయాన్ని సిట్ అధికారులు తెలిపారని లంకల దీపక్ రెడ్డి తెలిపారు.