సింగరేణిలో అలియాస్ బాధితుల ఆమరణ దీక్షలు క్షీణిస్తున్న పలువురి ఆరోగ్యం
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:43 AM
సింగరేణిలో అలియాస్ పేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రెండు రోజులుగా కొత్తగూడెంలోని సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు.
ఆందోళనలో కుటుంబ సభ్యులు
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో అలియాస్ పేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రెండు రోజులుగా కొత్తగూడెంలోని సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. సింగరేణిలోని 12 ఏరియాల్లో సుమారు 400 మంది అలియాస్ పేర్ల బాధితులు ఉన్నారు. సింగరేణి విజిలెన్స్ విచారణ పేరుతో 2020 సంవత్సరం నుంచి ఉద్యోగాలు రాని కార్మికుల వారసులు.. ఈనెల 12వ తేదీన సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. కానీ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. 14నుంచి ఆమరణ దీక్షను ప్రారంభించారు. రెండురోజులుగా 8 మంది అలియాస్ పేర్ల బాధితులు ఆమరణ దీక్ష చేపట్టడంతో.. ఆదివారం వారి ఆరోగ్యం క్షీణించింది. బీపీ తగ్గడంతో నీరసించారు. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.