మా శ్రమ ఫలితమే.. నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:45 AM
తమ శ్రమ ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న సీఎం
మొఖం పెట్టుకొని వస్తున్నారు: హరీశ్
సిద్దిపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ శ్రమ ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ‘‘మాదేమో శ్రమ ఫలితమైతే మీదేమో శిలాఫలకాల వంతా?’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆదివారం ముఖ్యమంత్రి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో శనివారం హరీశ్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను రద్దు చేశారని, రుణమాఫీ, రైతుభరోసాలో లోపాలున్నాయని వివరిస్తూ.. ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. తన లేఖకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా ఆరోపించిన సీఎం.. ఆ కాళేశ్వరం ఫలితంగానే ఇక్కడ పామాయిల్ పంట, ఫ్యాక్టరీ వచ్చాయనే విషయాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. కాళేశ్వరం కాలువ ద్వారానే ఈ ఫ్యాక్టరీ సమీపంలో 20కోట్ల లీటర్లతో స్టోరేజీ రిజర్వాయర్ తవ్వించామని గుర్తు చేశారు. ఈ నీళ్లతోనే ఫ్యాక్టరీ నిర్వహణ జరుగుతుందని చెప్పారు.