Secunderabad Protest Turns Violent: లష్కర్ నిరసన ఉద్రిక్తం
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:06 AM
సికింద్రాబాద్ను ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు...
శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
రాంగోపాల్పేట్/రెజిమెంటల్ బజార్/బౌద్ధనగర్/అడ్డగుట్ట, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ను ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు లష్కర్ జిల్లా సాధన సమితి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్ బయట హోటళ్లు, దుకాణాల వద్ద నిలబడిన ఆందోళనకారులను గుర్తించి బలవంతంగా ఠాణాలకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో గంటన్నరకు పైగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రోడ్డులో పలు దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్పేట ఠాణాకు తరలించారు. సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.