మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా పథకాలు
ABN , Publish Date - May 30 , 2026 | 12:19 AM
రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కె ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ
సిరిసిల్ల, మే 29 (ఆంరఽధజ్యోతి): రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కె ఫంక్షన్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళ స్వయం సహాయక సభ్యులకు మెగా బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్తో కలిసి ప్రభుత్వ శ్రీనివాస్ రుణాలను, ధాన్యం కొనుగోలు కమిషన్ చెక్కులను అందించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 6వ తేదీన 99 రోజుల కార్యాచరణలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై వివరించడం.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈ కార్యాచరణ అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ 57వేల కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60 శాతం మహిళల సంఘాలకే ఇచ్చామని తెలిపారు. ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రజలను, మహిళ లను భాగస్వాములను చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండో దశలో కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మహిళా సంఘాలకు ఆధ్వర్యంలో ఎరువుల షాపులు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ప్రతి మండలానికి ఒక రైస్ మిల్లు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్లలో ఉచిత ప్రయాణం పథకం కేరళలో కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
జిల్లాలోని మహిళా సంఘాలు తీసుకుంటున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి వైపు ఉపయోగించుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు ఏమైనా స్వయం ఉపాధి ఆలోచనలు, ఇతర సహాయం కోసం అధికార యంత్రాంగం సహకారం అందిస్తుందని వివరించారు. వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు ఉన్నారు.