పార్టీ మారితే 30 కోట్లు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:47 AM
పార్టీ మారితే రూ. 30 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్రావు తనను అడిగారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు.
గతంలో హరీశ్రావు ఆఫర్ ఇచ్చారు..అయినా నేను మారనని చెప్పా
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆరోపణ
కేటీఆర్, హరీశ్పై పరువు నష్టం దావా
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారితే రూ. 30 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్రావు తనను అడిగారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు. అయినా తాను పార్టీ మారబోనని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలిపారు. తనపై, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావు, క్రిశాంక్తో పాటు నమస్తే తెలంగాణ ఎడిటర్, తెలుగు స్ర్కైబ్ నిర్వాహకులపై బుధవారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో సంపత్కుమార్ దావా వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తనపై, తన పార్టీపై జన్వాడ ఫామ్హౌ్సలో కట్టు కథలు రాసి ప్రచారం చేసినవారిపై పరువునష్టం దావా వేసినట్లు చెప్పారు. ఓ కంట్రాక్టర్ను తాను రూ. 8 కోట్లు అడిగినట్లుగా వారు ప్రచారం చేశారన్నారు. కొద్దిగా ఆలస్యమైనా తనపై విషం చిమ్మిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. చేతకాకుంటే కేసీఆర్లా ఫామ్హౌ్సలో పడుకోవాలి కానీ.. ఇలాంటి రాజకీయాలు చేయవద్దన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీపైనా వారు కల్పిత ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.