ప్రాణం పోతే తిరిగిరాదు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:06 AM
ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తొందరపాటు నిర్ణయాలు వద్దు
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆవేదన
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం పోతే తిరిగి రాదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన కార్మికుడిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలని, వైద్యానికి ప్రభుత్వమే పూర్తి సాయం అందిస్తుందన్న భరోసా ఇచ్చి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆలస్యం చేయకుండా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపాలని మంత్రులకు సూచించారు. కాగా.. ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా ఆ మేరకు వారికి భరోసా కల్పించడంలో విఫలం అయ్యారంటూ అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కార్మికులతో చర్చల సందర్భంగా, సమ్మె సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలోనూ సరిగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.