వంతెన పైనుంచి పడిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:35 AM
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్ గ్రామ సమీపంలో సోమవారం ఆర్జీసీ బస్సు ప్రమాదవ శాత్తు వంతెన పైనుంచి కింద పడిపోయింది...
డ్రైవర్, కండక్టర్ సహా 19 మందికి గాయాలు
ఉట్నూర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్ గ్రామ సమీపంలో సోమవారం ఆర్జీసీ బస్సు ప్రమాదవ శాత్తు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తోసహా 19 మందికి గాయాలయ్యాయి. 34 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ సర్వీస్ శ్యామ్పూర్ సమీపంలోని ఇరుకు వంతెన వద్దకు రాగానే ఎదురుగా బొలేరో వాహనం వచ్చింది. బస్సు డ్రైవర్ పక్కకు తీసుకోగా వంతెనకు సైడ్వాల్స్ లేకపోవడంతో బస్సు టైర్లు వంతెన నుంచి కిందకు జారి పోయి బస్సు కిందపడిపోయింది. ప్రమాదంలో గాయాలపాలైన 19 మందిని వెంటనే ఉట్నూర్ ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. వీరిలో 12 మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్లు స్థానిక ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆర్టీసీ కరీంనగర్ విజిలెన్స్ బృందం సందర్శించింది.