719 డాక్యుమెంట్లకు రూ.1.93కోట్ల నగదు స్వాహా
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:23 AM
భూ భారతి పోర్టల్లో లోపాలను ఆసరాగా చేసుకుని స్టాంప్ డ్యూటీ మళ్లించిన 45 మందిపై కేసు నమోదైంది. స్వాహా చేసిన నగదును వసూలు చేయాలని సీసీఎల్ఏ ఆదేశించిన నేపథ్యంలో భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, వలిగొండ మండలాల తహసీల్దార్లు 45 మందిపై ఫిర్యాదు చేశారు.
‘స్టాంప్ డ్యూటీ మళ్లింపు’లో 45మందిపై కేసు నమోదు
యాదగిరిగుట్ట రూరల్, భువనగిరిటౌన్, వలిగొండ, తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): భూ భారతి పోర్టల్లో లోపాలను ఆసరాగా చేసుకుని స్టాంప్ డ్యూటీ మళ్లించిన 45 మందిపై కేసు నమోదైంది. స్వాహా చేసిన నగదును వసూలు చేయాలని సీసీఎల్ఏ ఆదేశించిన నేపథ్యంలో భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, వలిగొండ మండలాల తహసీల్దార్లు 45 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఏడు మండలాల్లో 719 డాక్యుమెంట్లు చేయగా, రూ.1.93కోట్ల నగదు స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు డాక్యుమెంట్ రైటర్లు, 41మంది మీ-సేవ, ఇంటర్నెట్ కేంద్ర నిర్వాహకులు ఉన్నారు. యాదగిరిగుట్టలో డ్యాకుమెంట్ రైటర్లు దేవేందర్, శ్రీకాంత్, జెల్లా పాం డు, జెల్లా పావని, కొండ భానుచందర్, నాగారాజు, నారా భాను, బసవరా జు, నాగరాజు, కృష్ణపై కేసు నమోదుచేసినట్టు తహసీల్దార్ గణే్షనాయక్ తెలిపారు. మొత్తం 212 డ్యాకుమెంట్లకు రూ.74,75,868 రుసుము చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.2,77,482 మాత్రమే ప్రభుత్వ ఖాజానాలో జమచేశారని ఆయన తెలిపారు. భువనగిరిలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. వీరు రిజిస్ట్రేషన్ చలానా తక్కువగా చెల్లించి రూ.11,27,795 మోసానికి పాల్పడినట్టు తేలిందన్నారు. వలిగొండ మండలంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ యుగేందర్గౌడ్ తెలిపారు. కలుకూరి మధు, భువనేష్, పి.బసవరాజు, రాజు, రాకేష్, శివరామకృష్ణ, తరుణ్పై కేసు నమోదుచేశామన్నారు. 41 రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో రూ.15,58,472 ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిందన్నారు. తుర్కపల్లి మండలంలో తహసీల్దార్ జలకుమారి ఫిర్యాదు మేరకు 52 డాక్యుమెంట్లలో సుమారు రూ.14లక్షలు అక్రమాలకు పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ తక్యుద్దీన్ తెలిపారు. రాజాపేటలో 344 డా క్యుమెంట్లకు సంబంధించి రూ.61.27లక్షలు పక్కదారి పట్టించారని ఇన్చార్జి తహసీల్దార్ ప్రదీ్పకుమార్ ఫిర్యాదుమేరకు జెల్ల పాండు, జెల్ల పావణి, గోపగాని శ్రీనాఽథ్, నారా భాను, బసవరాజ్, శ్రీకాంత్, రేహన్ష్పై పోలీసులు కేసు నమోదుచేశారు. మోటకొండూరులో ఆరుగురి ఐడీల ద్వారా అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందులో సీసీఎస్ సెంటర్ నిర్వాహకుడితో పాటు మరొకరు ఉన్నారు. అతడిని పోలీసులు ఈ నెల 11న అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 59 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ప్రభుత్వానికి రూ.20.45లక్షలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.1.50లక్షలు మాత్రమే చెల్లించారని ఇన్చార్జి తహసీల్దార్ జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.అశోక్ తెలిపారు.