kumaram bheem asifabad-వినాయక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:51 PM
వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసే వినాయక మండపాలు నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వినాయక ఉత్సవాలపై ఎస్పీ నితికాపంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్కలెక్టర్ హర్ష్ చౌదరిలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసే వినాయక మండపాలు నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వినాయక ఉత్సవాలపై ఎస్పీ నితికాపంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్కలెక్టర్ హర్ష్ చౌదరిలతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, అగ్నిమాపక, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. విద్యుత్శాఖ అధికారులు మండపాలు, నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబందించి భద్రత చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు పారిశుధ్య ఏర్పాట్లు మీషన్ భగీరథ అదికారులు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలో వినాయక నిమజ్జనం కోసం క్రేన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరిగేలా సంబందితశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జోస్తిన్ జోయల్, డీఎస్పీలు అశోక్, వహిదుద్దీన్, ఎస్ఈ ఉత్తమ్, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో నాగేంద్ర, మున్సిపల్ కమిషనర్లు అంజయ్య, తిరుపతి, తహసీల్దార్లు రీయాజ్ఆలీ, మధుకర్, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీల్లో 75 రకాల వైద్య సేవలు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మల్టీ పారామెట్రిక్ డయాగ్సోస్టిక్ పరికరాల ద్వారా 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, ఏవీ యానిక్స్ డివిజన్ హైదరాబాద్ మరియు ఒమ్ని యాక్టివ్ ఫౌండేషన్ వారి సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా జిల్లాకు సమకూర్చిన 22 మల్టీ పారామెట్రిక్ డయాగ్సోస్టిక్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునాతన పరికరాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే రోగులకు రక్త పరీక్షలు, ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఒమ్ని యాక్టివ్ ఫౌండేషన్ ఎండీ సందీప్ బాటియా, డీఎంహెచ్వో నాగేంద్ర, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు:
జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులలో అర్హులైన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో 2025-26 సంవత్సర షెడ్యూల్ కులాల అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన యూనిట్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సురేష్కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి అశోక్, లీడ్బ్యాంకు మేనేజర్ జనార్థన్, ఎంవీఐ మసూద్ఆలీ తదితరులు పాల్గొన్నారు.