కేరళంలో నేడు సీఎం రేవంత్ 4 రోడ్షోలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:10 AM
కేరళం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం చేయనున్నారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు హైదరాబాద్ నుంచి ...
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కేరళం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం చేయనున్నారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్.. 11.30 గంటలకు తిరువనంతపురం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు కోవళం, మావెళక్కర, పఠానాపురం, కొల్లం నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొని యూడీఎఫ్ తరపున ప్రచారం చేస్తారు. ఒక రోడ్ షో జరిగే ప్రాంతం నుంచి మరో రోడ్ షో జరిగే ప్రాంతం వరకూ ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణిస్తారు. ప్రచారం ముగియగానే హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారు.

త్రిస్సూర్లో శ్రీధర్ బాబు ప్రచారం
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. డీసీసీ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్తో కలిసి 2 రోజులుగా ఒల్లూర్, నట్టిక, కైపమండలం, పుదుక్కాడ్, చలకుడి, కోడుంగల్లూర్, మనలూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు గత ఎన్నికల్లో యూడీఎఫ్ 2 స్థానాలే గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో రోజంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న శ్రీధర్బాబు రాత్రివేళల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమై అందరూ ఐకమత్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని పశ్చిమ నాగపూర్ ఎమ్మెల్యే వికాస్ ఠాక్రే.. శ్రీధర్ బాబుతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.