హైదరాబాద్కు ఆదివాసీల విజ్ఞాన యాత్ర
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:23 AM
రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్తగా రివర్స్ టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ అటవీ ప్రాంతాల్లోనే నివసించే గిరిజనులకు విజ్ఞానయాత్ర పేరిట హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేసింది.
పర్యాటకంలో సరికొత్త ప్రయోగం.. రివర్స్ టూరిజం
ఆదివాసీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే..: మంత్రి జూపల్లి
ఉట్నూర్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక శాఖ సరికొత్తగా రివర్స్ టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ అటవీ ప్రాంతాల్లోనే నివసించే గిరిజనులకు విజ్ఞానయాత్ర పేరిట హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేసింది. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గోండుగూడ వద్ద పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను జెండా ఊపి ప్రారంభించారు. గోండుగూడ నుంచి జన్నారం వరకు ఆదివాసీలతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే బొజ్జుపటేల్ పర్యాటక శాఖ బస్సులో ప్రయాణించారు. మొత్తం 250 మంది ఆదివాసీలు ఏడు బస్సుల్లో ప్రయాణం సాగించారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని.. లుంబినీ పార్కు, శంషాబాద్ ఎయిర్పోర్టును సందర్శించారు. అంతకుముందు మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆదివాసీలకు కొత్త అనుభవాలు, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, అంతిమంగా ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో వినూత్నంగా రివర్స్ టూరిజం కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు.