Share News

ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి!

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:05 AM

ఆరు గ్యారంటీల అమలు దిశగా సుస్థిరమైన అడుగులు.. రైతులకు రుణమాఫీ.. మరో వెయ్యి పెంచి రైతు భరోసా అమలు... 200లోపు యూనిట్లు వాడే వారికి ఉచిత విద్యుత్‌.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌..

ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి!

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచన.. అందులోభాగమే ఫ్యూచర్‌ సిటీ, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

  • రెండున్నరేళ్లలో సవాళ్లను అధిగమించి అభివృద్ధిపై నజర్‌

  • సంక్షేమ పథకాల్లోనూ వెనకడుగు లేకుండా అమలు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీల అమలు దిశగా సుస్థిరమైన అడుగులు.. రైతులకు రుణమాఫీ.. మరో వెయ్యి పెంచి రైతు భరోసా అమలు... 200లోపు యూనిట్లు వాడే వారికి ఉచిత విద్యుత్‌.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్య జాబితాలో చేర్చి నిధుల కేటాయింపు.. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, దీర్ఘ కాలంలో తమదైన ముద్రను చూపించే ఫ్యూచర్‌ సిటీ, మూసీ ప్రక్షాళన.. యువతకు నైపుణ్యాలను నేర్పేందుకు స్కిల్స్‌ యూనివర్సిటీ.. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పును కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూనే.. సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం. 2023ఎన్నికల్లో మిత్రపక్షం సీపీఐతో కలుపుకొని కాంగ్రెస్‌కు వచ్చింది బొటా బొటీ మెజారిటీనే. ఐదారుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలా మొదలైన రేవంత్‌రెడ్డి పాలన.. రెండున్నరేళ్లు గడిచే సరికి సుస్థిర స్థాయికి చేరుకుంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది. ఆదాయం సృష్టిస్తేనే పేరొస్తుందని, ఆ దిశగా తాము చేపట్టే కార్యక్రమాలే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.

హామీలు, ఆపై అప్పుల భారం

బొటా బొటీ మెజారిటీతో కొలువు దీరిన రేవంత్‌ సర్కారు.. తొలి ఏడాది రాజకీయంగా, ఆర్థికంగా, పాలనా పరంగా సవాళ్లను ఎదుర్కొంది. ఓ వైపున పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండగా.. మరో వైపున రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ 39మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే ఉన్న ఆదాయ.. వ్యయాలకు, ఇచ్చిన హామీలకు లెక్క సరిపోవట్లేదు. అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఈ అస్థిర పరిస్థితులే కాంగ్రెస్‌ నాయకుల్లో ఐక్యతను తీసుకొచ్చాయి. సీఎం సీటుపైన ఆశను పక్కన పెట్టి... పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ మంత్రాంగమూ పని చేసింది. పదేళ్లపాటు బీఆర్‌ఎ్‌సకు అండగా ఉన్న మజ్లి్‌సను కాంగ్రెస్‌ వైపునకు తిప్పుకోగలిగారు. దీనికితోడు పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మద్దతూ పొందగలిగారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లయిన కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ద్వారా కాగ్రెస్‌ బలం మరింత పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8 సీట్లు గెలుచుకుంటే.. బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్నీ సాధించలేక ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వరుస ఓటములకు తోడు.. కేసీఆర్‌ కూతురు కవిత సొంత పార్టీ పెట్టుకుని బీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి చేస్తుండడం.. అధికార పార్టీకి బలాన్ని చేకూర్చింది.


తొలి ఏడాది పాలనపై పట్టుకే సరి!

రేవంత్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి ఏడాది మొత్తం పాలనా వ్యవస్థపై పట్టు సాధించడానికే సరిపోయింది. అసలే రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక క్రమశిక్షణకు తోడు దుబారా తగ్గింపు, పొదుపుపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రుణాలు మంజూరు చేసిన సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణ వాయిదాల చెల్లింపుల్లో వెసులుబాట్లు సాధించగలిగింది. మలి ఏడాదిలోనూ ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది.అయితే, కొన్ని నెలలుగా అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పరిధి 10లక్షలకు పెంపు,ఇందిరమ్మఇళ్ల మంజూరు, సన్నవడ్లకు రూ.500బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తూనే.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌ మార్కు ఉండే పథకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం.. ప్రజల్లో సానుకూలతను పెంచింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని నిర్ణయించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను రూ.200 కోట్లతో... వంద నియోజకవర్గాల్లో నిర్మిస్తోంది. ఈ స్కూళ్లు భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఆస్తులు కానున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో నైపుణ్యాలు, క్రీడా స్పూర్తిని పెంచేందుకు స్కిల్స్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలనూ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. మరిన్ని పథకాల అమలుకు కసరత్తు చేస్తోంది.


హైదరాబాద్‌ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు

రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్‌ను మరింత విస్తరించి, అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఒక వైపున జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, యూటీల నిర్మాణం విస్తృతంగా చేపడుతూనే... మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు పంపేందుకు హిల్ట్‌ పాలసీనీ తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. మెట్రో మొదటి దశను ఇటీవలే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. విస్తరణపైనా దృష్టి పెట్టింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా.. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుల్లో మూసీ ప్రక్షాళన మరొకటి. మూసీని కాలుష్య రహితంగా మార్చడమే కాకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణాన్ని సీఎం రేవంత్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్‌ సిటీలో పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయని, స్టూడియోలు, క్రీడా మైదానాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టుకు పది లేన్ల జాతీయ రహదారి నిర్మాణంపై కేంద్రం, తెలుగు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయితే ఫ్యూచర్‌ సిటీ వేగంగా అభివృద్ధి చెంది.. పెద్ద ఆదాయ వనరుగా మారనుంది. ఈ ప్రణాళికలన్నీ వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలను ఇస్తాయని, వచ్చే రెండున్నరేళ్లు తమకు అత్యంత కీలకమని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Jun 03 , 2026 | 06:05 AM