కేంద్ర రియల్ ఎస్టేట్ సలహా మండలి సభ్యుడిగా రెరా చైర్మన్
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:55 AM
కేంద్ర రియల్ ఎస్టేట్ సలహా మండలిలో రెరా ఛైర్మన్ ఎన్. సత్యనారాయణను సభ్యుడిగా నియమించినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న ఎన్.సత్యనారాయణ
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర రియల్ ఎస్టేట్ సలహా మండలిలో రెరా ఛైర్మన్ ఎన్. సత్యనారాయణను సభ్యుడిగా నియమించినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) చట్టం 2016 కింద ఏర్పడిన ఈ మండలి దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి మార్గనిర్దేశం చేసే కీలక వేదికగా పని చేయనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, వినియోగదారుల రక్షణ, ప్రాజెక్టుల పారదర్శకత వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వనుంది. మండలిలో తెలంగాణతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా కొనసాగుతారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి(ఏప్రిల్ 2) నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, చట్ట అమలు, పర్యవేక్షణ, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాల్లో ఈ మండలి కీలకం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను నేరుగా కేంద్రానికి తెలియజేసే అవకాశం లభిస్తుంది.