Share News

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌.. అమ్మాయిలూ జాగ్రత్త!

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:49 AM

‘‘ఒంటరితనంతో బాధపడుతున్నారా?.. మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు ఓ అందమైన అబ్బాయి తోడు కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌తో!’’.. ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా...

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌.. అమ్మాయిలూ జాగ్రత్త!

  • గంట కాఫీ మీట్‌కు రూ.499.. 10 గంటల తోడుకు 4,999

  • షాపింగ్‌, సినిమా, పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రెడీ

  • సోషల్‌ మీడియాలో ప్రకటనలు

  • అందమైన కుర్రాళ్లు కాదు.. ఏఐ మాయ.. సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘‘ఒంటరితనంతో బాధపడుతున్నారా?.. మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు ఓ అందమైన అబ్బాయి తోడు కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌తో!’’.. ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఇలాంటి పోస్టులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగండి. గంట కాఫీ మీట్‌కు రూ. 499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడు రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ. 1,999.. పది గంటల తోడుకు రూ.4,499 చెల్లిస్తే చాలు.. అంటూ ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫొటోలతో కనిపించే పోస్టుల మాయలో పడితే, మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అయిపోవడం ఖాయం!. ఇటీవల సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ‘రెంట్‌ ఏ బాయ్‌ఫ్రెండ్‌’ ప్రకటనల వెనుక సైబర్‌ నేరగాళ్ల ముఠా దాగి ఉందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ తరహా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతులు, మహిళలను హెచ్చరిస్తూ.. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ పెట్టారు. ఇలాంటి మోసాల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిేస్త వెంటనే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి కాల్‌ చేయాలని.. లేదా సైబర్‌క్రైమ్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.


ఏఐతో మాయ..

‘‘సైబర్‌ నేరగాళ్లు ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్‌ నుంచి ేసకరించిన అందమైన కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెడుతూ.. మెేసజ్‌ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలు పెడతారు. బుకింగ్‌ ధృవీకరణ, సెక్యూరిటీ డిపాజిట్‌, అడ్వాన్స్‌ అమౌంట్‌ పేరుతో డిజిటల్‌ వ్యాలెట్లు, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్‌ చేస్తారు. ఆన్‌లైన్‌ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్‌ చేేస ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్‌ క్రమంలో సేకరించిన ఫోన్‌ నంబర్లు, వ్యక్తిగత ఫొటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంది’’ అని సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ రకమైన మోసపూరిత ప్రకటనల వెనుక బాధ్యులైన వారిని గుర్తించి. చర్యలు తీసుకోవడంపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం దృష్టిసారించినట్టు చెప్పారు. ‘‘అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అన్నది గమనిస్తూ ఉండాలి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు నేరస్థుల వలలో పడే ప్రమాదం ఉంది. అపరిచిత వ్యక్తులతో చాటింగ్‌ చేయడం, కలవడం చేయవద్దు. డబ్బులు చెల్లించవద్దు’’అని సూచించారు.

Updated Date - Aug 09 , 2026 | 06:44 AM