kumaram bheem asifabad- రేషన్ బియ్యం పక్కదారి
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:41 PM
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగు తోంది. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి సన్న బియ్యంను ఉచితంగా పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారుల ముఠాలుగా ఏర్పడి బియ్యంను అధిక ధరలతో ఇతర ప్రాంతాల్లో విక్రయస్తు న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క లబ్ధిదారులు కూడా బియ్యంను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది.
- తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
పెంచికలపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగు తోంది. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి సన్న బియ్యంను ఉచితంగా పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారుల ముఠాలుగా ఏర్పడి బియ్యంను అధిక ధరలతో ఇతర ప్రాంతాల్లో విక్రయస్తు న్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క లబ్ధిదారులు కూడా బియ్యంను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయాన సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగక పోగా పౌరసరఫరాల శాఖ, పోలీసు శాఖాధికారుల నిఘా నేత్రాన్ని దాటి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల పరిధిలో 315 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 1,63,765 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,389 అంత్యోదయ కార్డులకు 43,821 యూనిట్లకు 468.615 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అలాగే 1,50,356 ఆహార భద్రత కార్డులకు 4,95,204 యూనిట్లకు 2809.928 మెట్రిక్ టన్నులు, 20 అన్నపూర్ణ కార్డులకు 0.200 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ప్రతి నెల సుమారు 3519.749 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.
- పేదల కడుపునింపేందకు..
పేదల కడుపునింపేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నా యి. దొడ్డు బియ్యం పంపిణీ సమయాన లబ్ధిదా రులు తినలేక డీలర్లు ఇతరులకు అమ్మే వారు. మరి కొంత మంది డీలర్లకు, ఇతరులకు విక్రయించే వారు. కొంత మంది వ్యాపారస్తులు రేషన్ షాపుల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యంను ప్రాసెస్ చేయించి అధిక ధర లకు విక్రయించే వారు. కొందరు బడా వ్యాపారులు, మిల్లర్లు, ఇత రుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యంను సేకరించి పాలీష్ చేయించాక ఇతర రాష్ట్రాలకు ఎగు మతి చేయించారు. కొన్ని సందర్భాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు, రాష్ట్ర సివిల్ సప్లయి అధికారులు పట్టుకున్నా అక్రమార్కులు మాత్రం తమ దందా మానడం లేదు.
- సన్న బియ్యంతో చెక్ పెట్టాలని..
ప్రభుత్వం సన్న బియ్యంతో అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టాలని భావించింది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బం ది పడ్డారు. కొంత మంది మధ్యతరగతి ప్రజలైతే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారులు జేబులు నింపుకున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుడు కచ్చితంగా తింటారనే భావనతో గతేడాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తోంది. తొలి నెలలో సన్న బియ్యంను లబ్ధిదా రులు తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలి పారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌరసరఫరాల అధికారులు భావించారు.
- కఠిన చర్యలు తీసుకుంటేనే..
సన్న బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫ రాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్ప టికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యంను అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమే కాక రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మి నా, కొనుగోలు చేసిన వారిపై కేసులు పెడుతామని చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు రేషన్ షాపులపైన కూడా నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
- అంచనాలను తలకిందులు చేస్తూ..
ప్రభుత్వం, అధికారుల అంచనాలను తల కిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్న బియ్యంను పక్క దారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సొమ్ము చేసుకోవడా నికి అక్రమార్కులు యత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో లక్షలు కొల్లుగొట్టిన వ్యాప ారులు ఇప్పుడు సన్న బియ్యం కావడంతో ప్రణాళికతో పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు తీసుకోక మిగిలి పోయిన సన్న బియ్యం, ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించడం మొదలు పెట్టారు. దొడ్డు బియ్యం కన్నా ఎక్కువ డబ్బు లు ముట్ట చెప్పుతుండడంతో పలు చోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్న బియ్యంను తరలిస్తుండగా జిల్లాలో పోలీసులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. తాజాగా గత ఆదివారం దహెగాం మండల కేంద్రంలో ఏడు క్వింటాళ్ల రాయితీ సన్న బియ్యంను ఎస్సై చుంచు రమేశ్ పట్టుకుని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇటీవల సిర్పూర్(టి) మండలం లోని రాష్ట్ర సరిహద్దున గత శుక్రవారం అర్థరాత్రి మాటు వేసి ఉండగా చింతలమానేపల్లి మండల నుంచి వస్తున్న వ్యాన్ను తనిఖీ చేయగా అందులో 60 బస్తాల్లో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు.