ముమ్మరంగా ఎస్ఎల్బీసీ పనులు
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:24 AM
శ్రీశైలం ఎడమ గట్టు (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇన్లెట్-1 బ్రహ్మగిరి (దోమలపెంట), ఔట్లెట్-2 మన్నెవారిపల్లి..
ఔట్లెట్ వైపు 100, ఇన్లెట్ వైపు12 మీటర్ల తవ్వకం
బ్రహ్మగిరి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇన్లెట్-1 బ్రహ్మగిరి (దోమలపెంట), ఔట్లెట్-2 మన్నెవారిపల్లి.. ఇరువైపులా డీబీఎం (డ్రిల్లింగ్, బ్లాస్టింగ్) పద్ధతిలో పనులు జరుగుతున్నాయి. మన్నెవారిపల్లి వైపున గడిచిన 45 రోజుల వ్యవధిలో సుమారు 100 మీటర్ల వరకు సొరంగం తవ్వినట్లు తెలుస్తోంది. ఇక బ్రహ్మగిరి వైపు నుంచి 20 రోజుల క్రితం పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు 12 మీటర్ల సొరంగం తవ్వినట్లు సమాచారం. శరవేగంగా పనులు కొనసాగించేందుకు సాంకేతిక కమిటీ కసరత్తు చేపట్టింది. గతేడాది ఫిబ్రవరి 22న సొరంగ ప్రమాదం జరిగే నాటికి 13.955 కిలోమీటర్ల సొరంగం పూర్తి కాగా.. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 205 మీటర్ల మేర వెనక్కి జరిగి, 13.750 కిలోమీటర్ నుంచి ఎడమ వైపునకు 150 మీటర్లు మళ్లించి అక్కడి నుంచి నేరుగా ఔట్లెట్ వైపు 21వ కిలోమీటర్కు అనుసంధానం చేయనున్నారు. సొరంగంలో మట్టి, రాళ్లను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. 150 మీటర్ల డైవర్షన్ సొరంగం తవ్వేందుకు నెల రోజులు పట్టొచ్చని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.