రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తోందా?
ABN , Publish Date - Feb 12 , 2026 | 03:05 AM
కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ల లోపల, బయట పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసింది. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు..
కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టింపులేదు
ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రె్సకు ఓటమి తప్పదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ల లోపల, బయట పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసింది. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. డబ్బు, అధికార బలంంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రె్సకు తెలంగాణ ప్రజలే గుణపాఠం చెప్తారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని కుట్రలు చేసినా మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రె్సకు ఓటమి తప్పదని, బీఆర్ఎస్ కూడా అరకొర తప్పితే గెలిచేదేమీ లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని, తమ కార్యకర్తలు ప్రతిఘటించి, ఎదురుతిరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ దాడుల ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే ఒక కార్పొరేషన్ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబెట్టే ప్రయత్నం చేసిందన్నారు.