కవిత రాజకీయ పార్టీ పెట్టడం పెద్ద జోక్
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:33 AM
కన్న తండ్రి కేసీఆర్ను గౌరవించని కవిత... ప్రజలకు తల్లి ఎలా అవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు.
ఆమె పోటీ చేస్తే డిపాజిట్ దక్కదు: రాజగోపాల్రెడ్డి
చౌటుప్పల్ టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కన్న తండ్రి కేసీఆర్ను గౌరవించని కవిత... ప్రజలకు తల్లి ఎలా అవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మొదటి సమావేశంలోనే కేసీఆర్ను తిట్టడం ద్వారా కవిత మర్యాదను పోగొట్టుకుందని అన్నారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆయన మాట్లాడారు. కవిత రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని, ఇంకా చెప్పాలంటే పెద్ద జోక్ అనిపిస్తోందన్నారు. కేసీఆర్తోనే కేటీఆర్, హరీశ్రావు, కవితలకు గుర్తింపు వచ్చిందని, కుటుంబంలోని ఆధిపత్య పోరుతోనే ఆమె బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. పైసలున్నయని కొంతమందిని ఓ ఫంక్షన్ హాల్కు తీసుకుపోయి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట తెలివిగా పార్టీ ప్రకటించినంత మాత్రాన ఓట్లు పడతాయా?అని ప్రశ్నించారు. కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.