ఎస్టీపీ ప్రాజెక్టులో 51 శాతానికి ‘రాఘవ’ వాటా
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:39 AM
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కార్పొరేషన్లలో రూ.1,906 కోట్లతో 22 మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణం కోసం టెండర్ దక్కించుకున్న ..
26 నుంచి 51 శాతానికి పెంపునకు ఆమోదం తె లిపిన ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్29 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కార్పొరేషన్లలో రూ.1,906 కోట్లతో 22 మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణం కోసం టెండర్ దక్కించుకున్న రాఘవ సీవరేజ్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ జాయింట్ వెంచర్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ (ఇండియా) పైవ్రేట్ లిమిటెడ్ కంపెనీ వాటా 51 శాతానికి పెరిగింది. హైదరాబాద్లో మురుగు నీటి శుద్ధి, మూసీనదిలో కాలుష్య నియంత్రణ కోసం అమృత్ 2.0లో భాగంగా దాదాపు రూ.4 వేల కోట్లతో 39 ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిని రెండు ప్యాకేజీలుగా విభజించారు. రెండేళ్ల క్రితం ప్యాకేజీ-2లోని 22 ఎస్టీపీల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం 1,906.44 కోట్లు. బీవీఎస్ఆర్ అనే కంపెనీతో రాఘవ కన్స్ట్రక్షన్, ఎస్ఎస్జీ కంపెనీలు కలిసి రాఘవ సీవరేజ్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ను ఏర్పాటు చేసి టెండర్ దక్కించుకున్నాయి. ఆ సమయంలో రాఘవ సీవరేజ్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్లో బీవీఎస్ఆర్కు 51 శాతం, రాఘవ కన్స్ట్రక్షన్కు 26 శాతం, ఎస్ఎస్జీ ఇన్ఫ్రాటెక్కు 23 శాతం వాటా ఉంది. తాజాగా రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ తన వాటాను 51 శాతానికి పెంచుకొని లీడ్ పార్ట్నర్గా మారింది. ఈ వాటాల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.