Share News

CID Investigation: వ్యవసాయశాఖను కుదిపేస్తున్న పేపర్‌ లీకేజీ

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:05 AM

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసా య విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ మూడో సంవత్సరం పేపర్‌ లీకేజీ ఉదంతం వ్యవసాయశాఖను కుదిపేస్తోంది.

CID Investigation: వ్యవసాయశాఖను కుదిపేస్తున్న పేపర్‌ లీకేజీ

  • 34 మందిపై సస్పెన్షన్‌ వేటు వేసిన సర్కారు.. వారిలో 30 మంది ఇన్‌ సర్వీస్‌ ఏఈవోలు

  • నలుగురు ప్రొ.జయశంకర్‌ వర్సిటీ సిబ్బంది కూడా

  • డీజీపీ ఆదేశాల మేరకు రంగంలోకి సీఐడీ

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసా య విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ మూడో సంవత్సరం పేపర్‌ లీకేజీ ఉదంతం వ్యవసాయశాఖను కుదిపేస్తోంది. పేపర్‌ లీకేజీలో భాగస్వాములైన 34 మంది ఇన్‌సర్వీ్స్ ఏఈవోల అడ్మిషన్లు రద్దుచేసిన వ్యవసాయ శాఖ.. వారిలో 30 మందిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మరో నలుగురు ఏఈవోలు పరీక్షలకు హాజరుకాలేదని ఇచ్చిన సమాచారం మేరకు వారిని మినహాయించింది. ఇప్పటికే జగిత్యాల కళాశాలకు చెందిన డీన్‌ భారతి నారాయణభట్‌తోపాటు వరంగల్‌, జగిత్యాల కళాశాలల్లో పనిచేస్తున్న సత్యనారాయణరెడ్డి, రమేశ్‌, కార్తీక్‌లను పేపర్‌ లీకేజీకి ప్రధాన బాధ్యులుగా గుర్తించి యూనివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య సస్పెండ్‌ చేశారు. దీంతో మొత్తం సస్పెన్షన్‌కు గురైనవారి సంఖ్య 34 కు చేరుకుంది. మూడేళ్ల క్రితం వ్యవసాయశాఖ సిఫారసుతో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాలు పొందిన ఇన్‌సర్వీ్స్ ఏఈవోలు.. వర్సిటీ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే! పరీక్షలకు హాజరు కాని నలుగురు ఇన్‌సర్వీ్‌స ఏఈవోలను మినహాయించి, మిగిలిన 30 మందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.


ఏఐ పెన్నులతో మాస్‌ కాపీయింగ్‌..

ఇన్‌సర్వీ్‌స ఏఈవోలు పేపర్‌ లీక్‌ చేయడంతోపాటు హైటెక్‌ పద్ధతిలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు, ‘ఏఐ’ఆధారిత పెన్నులతో జవాబులు రాసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య ఆదేశాలమేరకు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ డీజీపీ శివధర్‌రెడ్డినికలిసి సీఐడీ విచారణ కోరారు. డీజీపీ ఆదేశాల మేరకు.. ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, పేపర్‌ లీకేజీ జరిగిన తీరు, తెర వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు వర్సిటీ అధికారులు ఈ వ్యవహారంపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఆచార్య జయశంకర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నరేందర్‌రెడ్డి, ఓదెల సంపత్‌, డాక్టర్‌ అంజ య్య, ఎన్‌పీ రవికుమార్‌ ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే 34 మంది ఇన్‌సర్వీ్‌స్ ఏఈవోల అడ్మిషన్లు రద్దుచేశారు. వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టారు. భవిష్యత్తులో ఇన్‌సర్వీ్‌స కోటాలో వీరికి మళ్లీ అడ్మిషన్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. పేపర్‌ లీకేజీ ఉదంతం వెనక ఏంజరిగిందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని కమిటీకి ఆదేశాలు జారీచేశారు.

Updated Date - Jan 14 , 2026 | 07:06 AM