గమ్యం చేరుకోవడం కాదు.. ప్రాణాలతో చేరుకోవాలి!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:49 AM
వాహనదారులు గమ్యం చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకూడదని.. సురక్షితంగా ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ...
ఐఐటీహెచ్లో ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సులో పొన్నం
కంది, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ‘వాహనదారులు గమ్యం చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకూడదని.. సురక్షితంగా ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్లో మంగళవారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డుభద్రతా అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 1.8 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ అంశాలపై డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒక్క క్షణం అజాగ్రత్త జీవితాంతం తీరని నష్టాన్ని మిగిలిస్తుందని హెచ్చరించారు. వాహనదారులు వేగపరిమితిని పాటించాలని, మొబైల్ ఫోన్లు వాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అలైవ్-అరైవ్’ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించారు. రోడ్డు భద్రతను పాఠ్యాంశంగా చేర్చే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి ప్రోత్సహకాలు అందిస్తామని ప్రకటించారు.