త్వరలోనే కుల కార్పొరేషన్లకు నిధులు
ABN , Publish Date - May 16 , 2026 | 04:40 AM
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, నిధుల ఖర్చు, విధుల నిర్వహణ విషయంలోనూ స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు...
నిధుల ఖర్చు, విధుల నిర్వహణపై ఉత్తర్వులిస్తాం
పెరిక కుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, నిధుల ఖర్చు, విధుల నిర్వహణ విషయంలోనూ స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బుడగం శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో పెరిక కులం అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు చేస్తోందని అభినందించారు.