ఏసీబీ వలలో పెద్దపల్లి మునిసిపల్ ఏఈ
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:45 AM
పెద్దపల్లి మునిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న కళ్లేపల్లి సతీశ్ కుమార్ ఏసీబీ వలకు చిక్కారు. పెద్దపల్లిలోని తెనుగువాడ శ్మశానవాటిక..
లెక్కల్లో చూపించని రూ.32లక్షల నగదు పట్టివేత
హైదరాబాద్, పెద్దపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మునిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న కళ్లేపల్లి సతీశ్ కుమార్ ఏసీబీ వలకు చిక్కారు. పెద్దపల్లిలోని తెనుగువాడ శ్మశానవాటిక, కూనారంలోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్కు రూ.12.28 లక్షల మేర బిల్లును క్లియర్ చేసేందుకు సతీశ్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. మంగళవారం మునిసపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఆ డబ్బు తీసుకుంటుండగా సతీశ్ను అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత సతీశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా లెక్కల్లో చూపించని రూ.32,31,900 నగదు బయటపడింది. అంత నగదు ఎక్కడిది? అన్న ప్రశ్నకు సతీశ్ సరైన సమాధానం ఇవ్వలేదని, ఆయన్ను అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి విచారణ చేపడతామని వెల్లడించారు.