Rangareddy: ఆడబిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:56 AM
కన్న ప్రేమను మరిచిన ఓ జంట తమకు పుట్టిన ఆడపిల్లను మరొకరికి విక్రయించేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ పంచాయతీ లాల్సింగ్ తాండలో...
పసికందును రూ.లక్షకు విక్రయించేసిన వైనం
రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఘటన
షాద్నగర్రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కన్న ప్రేమను మరిచిన ఓ జంట తమకు పుట్టిన ఆడపిల్లను మరొకరికి విక్రయించేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ పంచాయతీ లాల్సింగ్ తాండలో చోటు చేసుకున్న ఈ శిశు విక్రయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఐసీడీఎస్ సీడీపీఓ ఉదయ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్సింగ్తాండకు చెందిన వాడ్యావత్ రేణుక 2025 నవంబరు 9న ఆడపిల్లకు జన్మనిచ్చింది. రేణుక జనవరి 1 నుంచి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకెళ్లలేదు. అంగన్వాడీ కార్యకర్త చింటు ఈ విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆపరేషన్ స్మైల్ ద్వారా విచారణ చేపట్టిన అధికారులు శిశు విక్రయం జరిగినట్టు గుర్తించారు. రేణుక దంపతులు ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన గోవింద్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబానికి తమ బిడ్డను విక్రయించినట్టు కనుగొన్నారు. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా, రేణుక దంపతులు తమ బిడ్డను రూ.లక్షకు విక్రయించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.