ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:46 AM
చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న 5 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
ఇందిరాపార్కు వద్ద మహాధర్నాలో వక్తల డిమాండ్
మిలియన్ మార్చ్ తరహాలో పోరాటం చేయండి: కవిత
కవాడిగూడ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న 5 లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే మిలియన్ మార్చ్ తరహాలో మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎ్సలో ఉండి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని, ఆనాటి ప్రభుత్వ పాపంలో తనకూ భాగస్వామ్యం ఉందని ఇందుకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా క్షమించాలని కోరారు. త్వరలో తెలంగాణ జాగృతి ఆధ్వర్వాన కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని, తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి, వారిని పర్మినెంట్ చేస్తామన్నారు. జాజుల శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మిగతా రాష్ట్రాల మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.