ఓటు హక్కును హరించేందుకు కేంద్రం కుట్ర
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:45 AM
రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని పలు పార్టీల నేతలు ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్...
నిరసన ర్యాలీలో పలు పార్టీల నేతలు
కవాడిగూడ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని పలు పార్టీల నేతలు ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, టీజేఎస్, వామపక్ష పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ మల్లు రవి, సీపీఐ కంట్రోల్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ, సీపీఐ శాసనసభ పక్షనేత కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. ర్యాలీ చేపట్టిన విపక్ష పార్టీల నేతలను ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్కే భవన్ ముందు అడిషనల్ సీఈవో వెంకటేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిన ఓటు హక్కును బలహీన పరిచే ఏ చర్య అయినా కాంగ్రె స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. నారాయణ మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ వల్ల బీజేపీకి కూడా ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని మోదీ హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఇండియాకు మోదీ వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రశ్నించే వాళ్లని లేకుండా చేయడం మోదీ లక్ష్యమని ధ్వజమెత్తారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కోదండరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓటు నమోదు ప్రక్రియకు అనుసరిస్తున్న పద్ధతితో అనేక మంది పేదలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. జాన్వెస్లీ మాట్లాడుతూ.. ఆర్ఎ్సఎస్ ఎజెండాకు అనుగుణంగా బీజేపీ వ్యతిరేక పార్టీలను అధికారంలోకి రాకుండా సర్ అనే ప్రక్రియ పేరుతో బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు.