సాగు లక్ష్యాన్ని చేరుకోకపోతే జోన్ల రద్దు: తుమ్మల
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:25 AM
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో పెరగటంలేదని, అక్కడున్న ఆయిల్ పామ్ కంపెనీల జోన్లు రద్దుచేసి ఇతర కంపెనీలకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో పెరగటంలేదని, అక్కడున్న ఆయిల్ పామ్ కంపెనీల జోన్లు రద్దుచేసి ఇతర కంపెనీలకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ప్రైవేటు పామాయిల్ కంపెనీల జోన్లను ఇప్పటికే రద్దుచేసి, ఆయిల్ఫెడ్కు అప్పగించినట్లు తెలిపారు. గురువారం సచివాలయంలో ఉద్యాన, మార్కెటింగ్, మార్క్ఫెడ్, సీడ్ కార్పొరేషన్, గిడ్డంగుల సంస్థల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ నిర్దిష్ట లక్ష్యాన్ని ఆయిల్ఫెడ్ కూడా చేరుకోకపోతే సదరు సంస్థకు సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచటం ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకుంటామని చెప్పారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ త్వరగా విస్తరించటానికి అవసరమైనచోట ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.