సర్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:51 PM
జిల్లాలో చేపట్టిన సర్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన సర్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గంలో సర్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్వోలు ఈ నెల 8 నాటికి 99 శాతం పంపిణీ చేసినట్లు నివేదిక ఇచ్చారని, కానీ దీనిని మళ్లీ ఒకసారి అధికారులు సవరణ చేసుకోవాలన్నారు. 2002 ఓటరు లిస్టులో ఉన్న వారికి లేదా వారి కుటుంబీకుల ఓటును తెలుసుకునే ప్రక్రియపై ఓటర్లకు అవగాహన ఉండదని, బీఎల్వోలు ఓటర్లకు సహకరించాలని సూచించారు. ఎన్యుమరేషన్ పత్రాలను ఇంటింటికి తిరిగి ఎలా ఇచ్చారో అలాగే నింపిన పత్రాలను బీఎల్వోలు తీసుకోవాలన్నారు. మొత్తం మంచిర్యాల నియోజకవర్గంలో వంద శాతానికి కేవలం 11.89 శాతం మాత్రమే సర్ప్రక్రియ పూర్తి అయ్యిందని, అధికారులు వేగవంతం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.