MBBS Admissions: దొంగ అడ్మిషన్లు చేస్తే సీటుకు కోటి ఫైన్!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:00 AM
ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తేడా వస్తే ఊరుకునేది లేదని, నిబంధనలు అతిక్రమించి అడ్మిషన్లు చేస్తే.. ఒక్కో సీటుకు ఏకంగా రూ. కోటి జరిమానా విధిస్తామని మెడికల్ కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించింది.
దాంతోపాటు వచ్చే ఏడాది సీట్లలో కోత
మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ హెచ్చరిక
ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై పరిమితి ఎత్తివేత
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తేడా వస్తే ఊరుకునేది లేదని, నిబంధనలు అతిక్రమించి అడ్మిషన్లు చేస్తే.. ఒక్కో సీటుకు ఏకంగా రూ. కోటి జరిమానా విధిస్తామని మెడికల్ కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ఫస్టియర్లో చేరిన విద్యార్థుల వివరాలను జనవరి 15వ తేదీ అర్ధరాత్రిలోపు ఎన్ఎంసీ పోర్టల్లో అప్ లోడ్ చేయాలని గడువు విధించింది. నీట్ మెరిట్, కౌన్సెలింగ్ లేకుండా ఇష్టారాజ్యంగా సీట్లు ఇస్తే అవి చెల్లవని, భారీ జరిమానాతో పాటు వచ్చే ఏడాది సీట్లలో కోత విధిస్తామని తేల్చి చెప్పింది. పారదర్శకత కోసం అడ్మిట్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీ వెబ్సైట్లోనూ పెట్టాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీట్లు పెంచుకోవాలంటే ‘ఒకేసారి 100 సీట్లకు మించి దరఖాస్తు చేయొద్దు’ అనే నిబంధనను ఎత్తేసింది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.