మెరిసిన పచ్చ బంగారం
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:59 AM
యుద్ధ ప్రభావంతో ఈ సీజన్లో పసుపు ధరలు తగ్గుతాయన్న ఆందోళనలో ఉన్న రైతులకు నిజామాబాద్ మార్కెట్ యార్డు ఊరటనిచ్చింది.
నిజామాబాద్లో క్వింటాల్ పసుపు రూ. 15,300
ఈ సీజన్లో ఇదే గరిష్ఠం.. సాగు తగ్గడమే కారణం
నిజామాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యుద్ధ ప్రభావంతో ఈ సీజన్లో పసుపు ధరలు తగ్గుతాయన్న ఆందోళనలో ఉన్న రైతులకు నిజామాబాద్ మార్కెట్ యార్డు ఊరటనిచ్చింది. శుక్రవారం మార్కెట్లో పసుపు క్వింటాల్కు రూ 15,300 ధర పలకడంతో ఈ సీజన్లోనే కొత్త రికార్డు నమోదైంది. గత కొద్దిరోజులుగా రూ.10 వేల లోపే ధర పలుకుతుండగా.. నాణ్యమైన పసుపు రావడంతో ధర ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం నిజామాబాద్ మార్కెట్ యార్డుకు 28వేల బస్తాల పసుపు రాగా, అత్యధిక ధర ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్కు చెందిన రైతు ఏనుగు నర్సయ్యకు సంబంధించిన పసుపునకు దక్కింది. అదేవిధంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన బాదాం నవీన్కు సంబంధించిన పసుపునకు రూ. 15,100 ధర లభించగా,. కేశాపూర్ రైతు దాసరి సురే్షకు చెందిన పసుపు రూ.14,700 ధర పలికింది. ఈ ఏడాది పసుపు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో లేదు. దీంతో నాణ్యమైన పంటకు గిరాకీ పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. పంట తక్కువగా ఉన్నా.. ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.