డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం..ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:54 AM
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందల్వాయి పరిధిలోని గన్నారం శివారులో బ్రహ్మంగారి ఆలయం ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున ....
నలుగురు మృతి.. 17 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘటన
మృతులు కర్ణాటక, మహారాష్ట్ర వాసులు
ఇందల్వాయి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందల్వాయి పరిధిలోని గన్నారం శివారులో బ్రహ్మంగారి ఆలయం ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో నలుగురు... మంజూష (30), రుషి (7), అబ్బాస్ (29), బస్సు మరో డ్రైవర్ రాహుల్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. 17మందికి గాయాలయ్యాయి. ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వాసులే ఉన్నారు. ఈ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు 22 మంది ప్రయాణికులతో రాత్రి 11 గంటలకు బయలుదేరింది. డ్రైవర్ సంజయ్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహారాష్ట్రలోని వాసి జిల్లాకు చెందిన మంజుష, రుషి తల్లీకొడుకులు. మంజూష భర్త లక్ష్మణ్కు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో అబ్బాస్ కర్ణాటక, రాహుల్ మహారాష్ట్ర వాస్తవ్యులు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బస్సులో 60 రామచిలుకలతో కూడిన ఓ పెట్టెను అధికారులు గుర్తించారు. వాటిలో ఎనిమిది మృత్యువాత పడ్డాయి.