నితిన్ నబీన్ పర్యటన ఓ ఫ్లాప్ షో
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:48 AM
బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన ఓ ఫ్లాప్ షోగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నాయకులు..
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన ఓ ఫ్లాప్ షోగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలికే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ఆ తర్వాత మిగతా విషయాలపై మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు నితిన్ నబిన్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలన్నారు. మతపరమైన రాజకీయం కోసమే పేర్ల మార్పును తెరపైకి తెస్తున్నారు తప్ప, నగర అభివృద్ధిపై బీజేపీ వద్ద ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.