హైదరాబాద్ ఎంతో మారిందన్న నిజాం!
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:24 AM
పచ్చని చెట్లు, కొండలు, గుట్టలతో ఆహ్లాదానికి నెలవు అన్నట్లుగా భాసించిన హైదరాబాద్ రూపురేఖలు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదని తొమ్మిదో...
ఒకప్పుడు పచ్చని చెట్లు, కొండలతో కళకళలాడిన నగరమేనా?
అయినా ఈ నేలంటే మమకారం.. నా బాల్యం ఇక్కడే గడిచింది
తొమ్మిదో నిజాం అజ్మత్ జా
హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో సందడి
హైదరాబాద్ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పచ్చని చెట్లు, కొండలు, గుట్టలతో ఆహ్లాదానికి నెలవు అన్నట్లుగా భాసించిన హైదరాబాద్ రూపురేఖలు ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదని తొమ్మిదో నిజాం అజ్మత్ జా అన్నారు. అయినా ఈ నేలంటే తనకు ఉన్న మమకాం ప్రత్యేకమైదని.. తన బాల్యం ఇక్కడే గడిచిందని వివరించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు, ఎనిమిదో నిజాం ముకర్రం జా కుమారుడైన అజ్మత్ జా హైదరాబాద్కొచ్చారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో భాగంగా ‘మీర్ బర్కత్ అలీఖాన్ ముకర్రం జా బహదూర్’ జీవిత విశేషాలతో ఆర్కిటెక్టు అనూరాధా నాయక్ రూపొందించిన కాఫీటేబుల్ పుస్తకంపై చర్చాగోష్ఠిలో అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అజ్మత్ జాను పలకరించగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను హైదరాబాద్లోనే పుట్టానని, తన బాల్యంలో కొంతకాలం చిరాన్ ప్యాలె్సలో గడిపానని, తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డానని చెప్పారు. ఏడాదికి ఒకట్రెండుసార్లు నగరానికి వస్తుంటానని వివరించారు. తాను కొన్ని హాలివుడ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామన్గా ప్రొఫెషనల్ ఫొటోగ్రఫర్గా పనిచేశానని వివరించారు. స్టీవెన్ స్పీల్బర్గ్, రిచర్డ్ అటెన్బరో లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశానని.. ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నానని చెప్పారు.