Share News

బెట్టింగ్‌ యాప్‌ కేసులో నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:58 AM

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో నటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని..

బెట్టింగ్‌ యాప్‌ కేసులో నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ

  • ప్రచార ఒప్పందాలపై ఆరా

హైదరాబాద్‌,ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసులో నటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆమెకు ఇటీవలే ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బెట్టింగ్‌ ఫ్లాట్‌ ఫామ్‌లను ప్రమోట్‌ చేయడం, వాటి కోసం ఆమె చేసిన ప్రకటనలు, ఆయా సంస్ధలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకున్న పారితోషికం, బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు పరిశీలించారు. నిధి అగర్వాల్‌ గతంలో జీత్‌విన్‌ అనే బెట్టింగ్‌ యాప్‌కు ఎక్కువగా ప్రచారం చేశారు. ఈ యాప్‌ నుంచి ఆమెకు పారితోషికం బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా అందిందా? ఇతర హవాలా మార్గాల నుంచి డబ్బు అందుకున్నారా? అనే విషయాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతోనే గతంలో నిధి అగర్వాల్‌ను సీఐడీ అధికారులు విచారించారు. తనకు అవగాహన లేకపోవడంతో బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోషన్‌ చేశానని, ఇకపై చేయనని నిధి అగర్వాల్‌ అప్పట్లో సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఈడీ అధికారులు గత ఏడాది జూలైలో 29 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రానా దగ్గుబాటి, ప్రకా్‌షరాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచులక్ష్మి తదితరులను ఇప్పటికే విచారించారు.

Updated Date - Aug 20 , 2026 | 05:59 AM