టీజీపీఎస్సీ ఫీజు రూ.1000కి పెంపుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:08 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచడంపై జాతీయ మానవ హక్కుల..
న్యూఢిల్లీ, జూన్10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. టీజీపీఎస్సీ ఇటీవల ఆర్అండ్బీ శాఖలో 222 ఏఈఈ (సివిల్), 49 ఏఈఈ (ఎలక్ర్టికల్) పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకే తరహా కొలువులకు ఒకేసారి కాకుండా వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల అభ్యర్థులు ప్రతి దరఖాస్తుకూ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని వై. బాలచందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజులను అమాంతం పెంచడం రాజ్యాంగ విరుద్థమని వివరించారు. దీనిపై విచారణ జరిపి పెంచిన ఫీజుల అమలును తక్షణమే నిలిపివేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.