కోదాడ లాకప్ డెత్ కేసులోసీఐ, ఎస్సైలను అరెస్ట్ చేయాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:04 AM
సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన దళిత యువకుడి లాక్డెత్ కేసులో నిందితులుగా ఉన్న సీఐ, ఎస్సైలను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆదేశించారు..
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్
జ్యోతినగర్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన దళిత యువకుడి లాక్డెత్ కేసులో నిందితులుగా ఉన్న సీఐ, ఎస్సైలను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరులో కోదాడకు చెందిన కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు పోలీస్ కస్టడీలో చనిపోయాడని, ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాల బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సత్వరం దర్యాప్తు జరిపి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్సీ పోలీసుల పదోన్నతులకు సంబంధించి శాఖ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తంచేశారు. రోస్టర్ ప్రకారం ఎస్సీ పోలీస్ సిబ్బంది పదోన్నతులు కల్పించాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.