10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:23 AM
నారాయణపేట జిల్లాలో పది టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో....
వాటి విలువ రూ.1కోటి: ఎస్పీ వినీత్
నారాయణపేట టౌన్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో పది టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం బండగొండ, భూనీడ్ గ్రామాల్లో జిల్లా పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1కోటి విలువైన 10 టన్నుల నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామానికి చెందిన వి.బాలకృష్ణ, శశివర్ధన్ నాయుడు ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి, నారాయణపేట జిల్లా రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. వి.బాలకృష్ణ, శశివర్ధన్ నాయుడులపై నారాయణపేట రూరల్, మద్దూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.