నాగారం భూదాన్ కుంభకోణంపై ఈడీ కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:58 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు అన్యాక్రాంతం ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు అన్యాక్రాంతం ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ఈడీ కేసు పెట్టడంలో చట్టబద్ధత లేదంటూ నిందితులు ఎంఏ అక్తర్, లతీఫ్ రహమాన్ షర్ఫాన్, అబ్దుల్ రహమాన్ షర్ఫాన్ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఈ వ్యవహారంలో ఈడీ కేసు (ఈసీఐఆర్) నమోదు చేయడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు. ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ కుంభకోణానికి సంబంధించిన నగదు లావాదేవీలు జరిగినట్లు, పలు అక్రమాలు ఉన్నట్లు తేలినందునే ఈడీ జోక్యం చేసుకుందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టేసింది.