బీసీలకు 80శాతం సబ్సిడీతో 20లక్షల రుణమివ్వాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:00 AM
బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో బీసీ కుటుంబానికి 80శాతం సబ్సిడీతో రూ.20లక్షల రుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర....
ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
బర్కత్పుర, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో బీసీ కుటుంబానికి 80శాతం సబ్సిడీతో రూ.20లక్షల రుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో రుణాలపై నిర్ణయం తీసుకోవాలని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. బీసీ కార్పొరేషన్కు రూ.13 వేల కోట్లు, 21 బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.8 వేల కోట్లు కేటాయించాలన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు రూ.8,500 కోట్లు తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్కుమార్ అధ్యక్షతన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ సమన్వయంతో కోర్కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. వచ్చే బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.