అమ్మని కడసారి చూసుకునేందుకు నాన్నని రప్పించరూ.!!
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:40 AM
వారిద్దరూ ఇంటర్మీడియట్ విద్యార్థులు.. అనారోగ్యం కారణంగా వారి తల్లి మరణించింది. ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లిన తండ్రి ప్రస్తుతం విమానాలు...
నిజామాబాద్ జిల్లాలో అనారోగ్యంతో భార్య మృతి
విమానాలు లేక దుబాయ్లో ఉండిపోయిన భర్త
తండ్రి రాక కోసం పిల్లల ఎదురుచూపులు
మెండోరా, మార్చి4, (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ఇంటర్మీడియట్ విద్యార్థులు.. అనారోగ్యం కారణంగా వారి తల్లి మరణించింది. ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లిన తండ్రి ప్రస్తుతం విమానాలు లేక అక్కడే ఉండిపోయారు. అమ్మ లేదు.. కష్టసమయంలో తోడుగా నిలిచేందుకు పక్కన తండ్రి లేడు. దీంతో ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో నిలిచారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన నూకల లక్ష్మీనర్సు(40) అనారోగ్యం వల్ల బుధవారం మరణించింది. ఆమె భర్త లింబాద్రి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. భార్య మరణ వార్త విన్న వెంటనే స్వగ్రామానికి రావాలని లింబాద్రి ప్రయత్నించినా.. యుద్ధం నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో కష్టంగా మారింది. అబుదాభీ నుంచి భారత్కు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. అయితే, తల్లిని కోల్పోయి శోకంలో ఉన్న లింబాద్రి కుమారులు.. తమ తండ్రి స్వదేశానికి వచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వేడుకుంటున్నారు. అమ్మను కడసారి చూసుకునే అవకాశాన్ని నాన్నకు కల్పించాలని కోరుతున్నారు.