మొయినాబాద్ డ్రగ్స్ కేసులో..సిట్ దర్యాప్తుతో నిజాలన్నీ వెలుగులోకి
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:26 AM
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వాస్తవాలన్నీ సిట్ దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
నిబంధనల మేరకే కొందరికి స్టేషన్ బెయిల్
పుట్టా మహేశ్కు బెయిల్లో మా ప్రమేయం లేదు
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వాస్తవాలన్నీ సిట్ దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఎంపీ పుట్టా మహేశ్కుమార్ సహా మరికొందరు నిందితులు స్టేషన్ బెయిల్ పొందడంలో తమ ప్రమేయమేమీ లేదని, నిబంధనల మేరకే వారికి బెయిల్ లభించిందని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. 2028లో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభు త్వం జాతీయ జనగణన నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ జరుగుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు జరగాలని తాము కోరుకుంటున్నామని, తప్పనిసరిగా ఆ ప్రక్రియకు సహకరిస్తామని అన్నారు.