అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే అరాచకాలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:21 PM
అక్కసుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపై విద్వేషంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఆయన అనుచరులు మంచిర్యాలను ఆగం మంచిర్యాలగా చేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు
-మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : అక్కసుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపై విద్వేషంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఆయన అనుచరులు మంచిర్యాలను ఆగం మంచిర్యాలగా చేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు శుక్రవారం రాళ్ల వాగును సందర్శించి అక్కడ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలకు ఉపయోగపడే అంతర్గాం బ్రిడ్జిని రద్దు చేయడం బాధాకరమన్నారు. రద్దు చేసి న బ్రిడ్జి నిధులను లక్ష్మీటాకీస్ నుంచి ఆండాళమ్మ కాలనీ రోడ్ల వెడల్పు కోసం కేటాయించడం రాజకీయ కక్ష అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయని, రోడ్లు అవసరం లేని చోట్ల రూ. 15.50 కోట్లతో ఎమ్మెల్యే ఇటీవల శంకుస్ధాపన చేయడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాసగార్డెన్ వరకు రోడ్డు వెడల్పు పనులకు రూ. 35 కోట్లు కేటాయించానని తెలిపారు. వందల సంఖ్యలో వాహనాలు వెళ్లే హైవే రోడ్డును ఆరు వరుసలు పెట్టకుండా నాలుగు వరుసలు మాత్రమే సరిపోతుందని చెప్పి కేవలం ఎమ్మెల్యే ఇంటి వైపు వెళ్లేందుకు అనువుగా ఆరు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టడం ఆయన స్వార్ధ పూరిత వైఖరికి నిదర్శ నమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణాధ్యక్షుడు సత్యం, నస్పూర్ అధ్యక్షుడు సుబ్బన్న, నాయకులు లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.