శునకాలు మనిషితో సమానం
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:19 AM
శునకాలు మనిషితో సమానమని, వాటికి విశ్వాసం ఎక్కువని మంత్రులు సీత క్క, కొండా సురేఖ అన్నారు.
కుక్కపిల్లల దత్తత మేళాలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ
కుక్కలను చంపాలని ప్రభుత్వం ప్రకటించలేదు
ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి: కొండా సురేఖ
బంజారాహిల్స్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): శునకాలు మనిషితో సమానమని, వాటికి విశ్వాసం ఎక్కువని మంత్రులు సీత క్క, కొండా సురేఖ అన్నారు. బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శనివారం వీధికుక్క పిల్లల దత్తత మేళా జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులతోపాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కుక్కలను చంపాలని ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదని, ప్రతిపక్షాలు ఆరోపణలు మాని స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇస్తే మరికొన్ని శునకాలను దత్తత తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ శునకాలపై దాడులను ప్రభుత్వం ఎక్కడ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కుక్కలకు వైద్య చికిత్సలను అందించి కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలందరూ బాధ్యతగా కుక్కలను దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలని సూచించారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ కుక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాను రెండు కుక్కలను దత్తత తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల, తాజా మాజీ కార్పొరేటర్ పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.