విద్యార్థులు తమ బాధ్యతలు మరచిపోవొద్దు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:34 AM
తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని, తమ కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారనే విషయాన్ని పిల్లలు గుర్తెరగాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ ఉద్బోధించారు.
కేఎల్హెచ్ వర్సిటీ విద్యార్థులకు మంత్రి వివేక్ దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 22(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని, తమ కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారనే విషయాన్ని పిల్లలు గుర్తెరగాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ ఉద్బోధించారు. అందుకే ఉన్నత శిఖరాలు అనే లక్ష్యానికి చేరుకునే దిశగా విద్యార్థులు తమ బాధ్యతలను మరిచిపోవొద్దని సూచించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ బాచుపల్లి క్యాంపస్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తోందని చెప్పారు. మెరిట్ విద్యార్థుల కోసం కేఎల్హెచ్ యూనివర్సిటీ అమలుచేస్తున్న స్కాలర్షిప్ విధానం చాలా బాగుందని ప్రశంసించారు. మెరిట్ విద్యార్థులకు ఏటా అందిస్తున్న రూ.100 కోట్ల స్కాలర్షిప్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. యూనివర్సిటీ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.